ఉత్తరాఖండ్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో గంగానదిలో వరద భీకరరూపం దాల్చుతోంది. శుక్రవారం ఈ తీవ్రత మరింత ఎక్కువైంది. ప్రమాదస్థాయిని సూచించే మట్టం 339.50 మీటర్లు ఉండగా ప్రస్తుతం నది 339.40 మీటర్ల స్థాయిలో ప్రవహిస్తోంది. అంటే ప్రమాదస్థాయి మట్టానికి కేవలం 10 సెంటీ మీటర్లు మాత్రమే. దీన్ని మించి ప్రవహిస్తే పరిసరప్రాంతాల్లో అపారనష్టం వాటిల్లుతుంది.
చమోలి ప్రాంతంలో వరద ఉద్ధృతికి ఆరు వంతెనలు ఒక్కసారిగా కూలిపోగా వరదను చూడటానికి వచ్చినవారంతా నదికి ఒక పక్కన ఉండిపోయారు. నదీ తీరం పక్కన పర్వత ప్రాంతాల్లో ఉండే ఇళ్లు క్రమంగా కూలిపోతున్నాయి. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి.