పేదరికం నుండి బయటపడాలంటే ప్రతి ఇంట్లోనూ చదువులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కర్నూలు జిల్లా, ఆదోని లో మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో జగనన్న విద్యా కానుక కింద కిట్స్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు మంచి చదువును అందించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తుపై పెట్టుబడి పెడుతుందని ఆయన చెప్పారు.నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని సీఎం జగన్ అన్నారు.
పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించేలా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. బడికి వెళ్తున్న పిల్లలకు వరుసగా మూడో ఏడాది అమ్మఒడి పథకాన్ని అందించామన్నారు.
నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామన్నారు. బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని బైజూస్ యాప్నుపేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. బాగా చదువుకుంటే విద్యార్ధులు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే ఆస్తి చదువు అని సీఎం చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని అన్నారు..విద్యార్థుల కోసం బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చామని అన్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా అందజేస్తున్నామని అన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని అన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుండి 8వ తరగతిలో అడుగు పెట్టే ప్రతి విద్యార్ధికి ట్యాబ్ ను అందించనున్నట్టుగా సీఎం ప్రకటించారు.ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది 8వ తరగతిలో చేరే విద్యార్ధులకు ట్యాబ్ ల కొనుగోలు కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
మరోవైపు..ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ను త్వరలోనే మంజూరు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కోరినందున ఆదోనికి ఆటోనగర్, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు..