తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లో మరోసారి భగ్గుమన్నవర్గ విబేధాలు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ను నాశనం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీర్పేట లో పర్యటించిన తీగల కృష్ణమూర్తి జరుగుతున్న పనులపై తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడుతూ ..సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు. చెరువులను, స్కూల్ స్థలాలను కూడా వదలడం లేదన్నారు .
చెరువుల్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా కడతారని ప్రశ్నించారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతుంటే చూస్తూ ఊరుకోనన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు.
తమ పార్టీ నుంచి సబితా ఇంద్రా రెడ్డి గెలవలేదని ,నియోజకవర్గంలో అభివృద్ధి గాలికొదేలిసిందని అన్నారు. ట్రంక్ లైన్లు పూర్తి కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై త్వరలోనే సీఎం కేసీఆర్ని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తీగల కృష్ణారెడ్డి తెలిపారు.
గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి తెరాస నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా సబిత విజయం సాధించారు. అనంతరం సబితారెడ్డి తెరాస కండువా కప్పుకుని మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.