telugu navyamedia
క్రీడలు వార్తలు

ముంబై ని ఓడించగల టీం హైదరాబాదే…

టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ ప్లే ఆఫ్ చేరే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదేనని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా ఫైవ్ టైమ్ చాంపియన్, పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించే సత్తా కూడా హైదరాబాద్‌కే ఉందన్నాడు. గత ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ నిలకడైన ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. గత సీజన్‌ ఆరంభంలో తడబడినా.. చివర్లో చెలరేగి మూడో స్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్‌లో ఆ జట్టు ఫస్టాఫ్ మ్యాచ్‌లను చెన్నై, ఢిల్లీ వేదికగా ఆడనుంది. అయితే ఈ రెండు వేదికలు ఆరెంజ్ ఆర్మీకి కలిసొస్తాయని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.

అంతేకాకుండా ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్‌లో లేదా సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుకు నిలుస్తుంది. వారి తొలి తొమ్మిది మ్యాచ్‌ల్లో 6 లేదా ఏడు గెలిచే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ ఫస్టాఫ్ మ్యాచ్‌ల వేదికలు వారికి కలిసి రానున్నాయి.’అని చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించే దమ్ము, సత్తా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఉందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు గట్టి సవాల్ విసిరే జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. ముంబైతో ఆడే నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా హైదరాబాద్ రెండు గెలుస్తుంది.’అని చోప్రా పేర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ముంబైని ఓడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లే పేపర్‌పై బలంగా కనిపిస్తున్నాయి అని తెలిపాడు.

Related posts