బండి సంజయ్కి మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. కేసీఆర్ను జైళ్లో పెట్టేముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలని హితువు పలికారు. కేసీఆర్కు ఉన్నది 40 ఎకరాల ఫామ్హౌజేనని బీజేపీ నాయకులు డ్రామాలను కట్టిపెట్టాలని అన్నారు. 40 ఎకరాల ఫామ్హౌజ్ కోసం ఎవరైనా కాళేశ్వరం కడతారా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ కట్టే దమ్ము లేదు కానీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి నిరూపించు కోర్టుకు వెళ్లు అని బండి సంజయ్కు సవాల్ చేశారు. నీళ్లిచ్చే తెలివి లేదు కానీ ఇస్తే ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఆరోపణలు చేయడం కాదు నిరూపించే సత్తా ఉండాలని బండి సంజయ్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. అటు బండి సంజయ్పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, రాష్ట్ర ప్రాజెక్టుల పై ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారని బాల్క సుమన్ తెలిపారు. రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేకం ఉంటాయని.. వాటిలో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేశారని ప్రశ్నిస్తున్న బండి సంజయ్ కు ఢిల్లీ లో ఏం జరిగిందో తెలియదా.. ఎంపీ గా ఉన్న వ్యక్తి కి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తెలియవా..అవగాహన లేదా ? అని ప్రశ్నించారు. బండి సంజయ్ అడిగాడని కాదు… రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి చెప్తున్నామన్నారు.
previous post
next post