తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో తమ వైఖరి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న కొత్త రెవెన్యూ చట్టం బిల్లుకు ఎంఐఎం పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.
కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా ఒవైసీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక అనేక మంది భూములు పోగొట్టుకున్నారని తెలిపారు. భూములు కోల్పోయిన వారిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారని వెల్లడించారు. గతంలో భూములకు సంబంధించి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ భూ ఆక్రమణలకు మాత్రం అడ్డుకట్ట పడలేదని అన్నారు.
గతంలోని చట్టాలు భూకబ్జాదారులకు అనుకూలంగానే ఉండేవని విమర్శించారు. పట్టాల ఎంట్రీలో అక్రమాలు జరిగాయని, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి రికార్డుల్లో తేడాలు వచ్చాయని వివరించారు. తాజా రెవెన్యూ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు: సీఎం జగన్