చత్తీస్ఘడ్ మాజీ సీఎం, సీనియర్ నేత అజిత్ ప్రమోద్ కుమార్ జోగి ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాయ్పూర్లో శుక్రవారం తుదిశ్వాస విడిశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
అజిత్ జోగి రాజకీయాల్లోకి రాకముందు కలెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. భోపాల్లోని మౌలానా ఆజాద్ టెక్నాలజీ కాలేజీలో జోగి మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. 1968లో ఆయన యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించారు. రాయ్పూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొన్నాళ్ల పాటు లెక్చరర్గా పనిచేశారు. ఐపీఎస్, ఐఏఎస్గా కూడా ఈయన సెలక్ట్ అయ్యారు. భోపాల్ కలెక్టర్గా 1981 నుంచి 1985 వరకు పనిచేశారు.