ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అన్నారు. తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారనుందని… ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మామల్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు ఉండనట్టు… నివర్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉంటాయని… ముందస్తుగా నెల్లూరు జిల్లాకు ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను పంపామని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామని…సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.