వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్రంలో రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమిత్ షాను జగన్ అభినందించారు.
ఈనెల 30న ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని అమిత్షాను జగన్ ఆహ్వానించారు. సుమారు 30 నిమిషాలపాటు జగన్, అమిత్ షా భేటీ కొనసాగింది. తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్కు వైఎస్ జగన్ చేరుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. 30 నిమిషాల పాటు సాగిన ఇద్దరి మధ్య సమావేశంలో ఏపీ విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయసహకారాలు అందించాలని అమిత్షాను కోరారు.