తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్లో రెండో స్ధానంలో ఉన్న వారి పరిస్ధితి ఎప్పటికీ ఇంతేనని ఆమె అన్నారు. మొన్న ఆలె నరేంద్ర, నిన్న నేను, నేడు తన్నీరు హరీష్ రావు అని ఆమె అన్నారు.
హరీష్ రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై విజయశాంతి ఆ వ్యాఖ్యలు చేశారు. . నమ్మిన వారిని తడి గుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమనే విషయం మరోసారి రుజువైందని ఆమె అన్నారు. కాలం మారినా టీఆర్ఎస్ నాయకత్వ వైఖరి మారలేదని ఆమె విమర్శించారు. దొరల వారసత్వ పాలన తీరు కూడా నాడు, నేడు, రేపు.. ఎప్పుడైనే ఇంతేనని ఆమె ఎద్దేవా చేశారు.