ఇకపై తనను టీడీపీ సభ్యుడిగా చూడవద్దని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. తనను ప్రత్యేక సభ్యుడిగా తనను గుర్తించాలని ఆయన విన్నవించారు. శాసనసభలో వంశీ మాట్లాడుతూ టీడీపీలో కొనసాగే పరిస్థితి తనకు లేదని వంశీ చెప్పారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనను ఎన్నుకున్నారనివారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు.
ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం చేస్తున్న పనులను కొంత మేర సమర్థించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధిష్ఠానంతో తాను చెప్పానని అన్నారు. తన మాటలను వినకపోగా ప్రెస్ మీట్లు పెట్టించి తనను బూతులు తిట్టించారని అన్నారు. సోషల్ మీడియాలో తనను వ్యక్తిగతంగా తిట్టించారని చెప్పారు. ఆ తర్వాత తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వంశీ వెల్లడించారు.