ఏపీ సీఎం జగన్ ఈరోజు సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన కనకదుర్గమ్మను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కనకదుర్గమ్మ వారికి ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం హోదాలో తొలిసారిగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
మూలా నక్షత్ర ఘడియల్లో అమ్మవారిని దర్శించుకున్న జగన్, ప్రత్యేకపూజలు నిర్వహించారు. దర్శనానంతరం జగన్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.