తెలంగాణలో కరోనా టెస్టులు సరిగా చేయడంలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మర్కజ్ లింకులను బయటపెట్టి దేశాన్ని అలర్ట్ చేశామని తెలిపారు. తెలంగాణలో 90 శాతం కరోనా కేసులకు మర్కజ్ లింకులే కారణమని పేర్కొన్నారు. ముంబయి, బెంగళూరు నగరాల స్థాయిలో జనాభా కలిగివున్న హైదరాబాదులో తాము మర్కజ్ కేసులను వెంటాడి పట్టుకుని ఉండకపోతే, దేశంలోనే అత్యధిక కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యేవని తెలిపారు.
మర్కజ్ తో లింకున్న 1244 మందిని గుర్తించి వారిని క్వారంటైన్ కు తరలించే ప్రయత్నం చేస్తే తమ పోలీసులపైనా, వైద్య ఆరోగ్య సిబ్బందిపైనా దాడులు జరిగాయని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తుమ్ములు లేవు, దగ్గు లేదు, జలుబు, జ్వరం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా పట్టుదలగా వ్యవహరించామని అన్నారు. వారిలో 200కి పైగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుని కరోనా ప్రభావాన్ని గణనీయంగా నియంత్రించిందని వివరించారు.