వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్పై పోటీ చేస్తానంటూ ప్రకటించిన ఐపీఎస్ అధికారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది . అలా ప్రకటించిన కొద్ది గంటలకే అమితాబ్ ఠాకూర్ అరెస్టు కావడం పలు అనుమానాలను రేపుతోంది.
అయితే అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై ఆయన్ను ఆరెస్టు చేసినట్లు పోలీసుల ప్రకటించారు. బీఎస్పీ ఎంపీ అతుల్రాయ్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 24 ఏళ్ల యువతి.. తన స్నేహితుడితో కలిసి ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది..
అంతకు ముందు ఆమె మాట్లాడుతూ.. ఎంపీ అతుల్ రాయ్కు సాయం చేసేలా కొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. 24వ తేదీన ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఈ కేసులోనే అమితాబ్ ఠాకూర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే అమితాబ్ ఠాకూర్ తన విధుల పట్ల నిబద్ధతతో పని చేయడం లేదని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనను తొలగించినట్టుగా తెలుస్తోంది. అనంతరం తాను 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యోగిపై పోటీ చేస్తానని, త్వరలోనే పార్టీని ప్రారంభించబోతున్నట్లు అమితాబ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్టు యూపీలో సంచలనంగా మారింది.