హైదరాబాద్ నగరంలోని రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్సీయూ రోడ్లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మానస(22), మానస(21) అబ్దులా అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. సిద్దు అనే మరో జూనియర్ ఆర్టిస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి. అబ్దుల్ రహీమ్ మాదాపూర్లోని యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎం.మానస స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లిగా గుర్తించారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడ్డ సిద్ధూను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.