ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యకలాపాలను సీఎం జగన్ దెబ్బతీశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తన పాలనను ప్రజలు మెచ్చుకుంటారని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని యనమల వ్యాఖ్యానించారు. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పిన జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని దుయ్యబట్టారు.
100 రోజుల్లోనే తన కంటే చెడ్డ సీఎం లేరని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని అన్నారు.సింగపూర్ వెళ్లిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు లేవని చెబుతూ, తన విధానం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేసిందని యనమల అన్నారు.