సిద్దిపేట పట్టణంలో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విక్టరీ చౌరస్తాలోని ఓ వెదురు కర్రల దుకాణంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలోని 20 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. వీటిలో ఏడు వెదురు కర్రల దుకాణాలు, 3 కార్పెంటర్ దుకాణాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మరో పది దుకాణాల్లో ఆస్తినష్టం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శకటంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఒకే అగ్నిమాపక శకటం ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు.
ఘటనా స్థలి పక్కనే ప్రైవేట్ ఆస్పత్రి ఉండటంతో రోగులు, బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనతో సిద్దిపేట-మెదక్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఒక దుకాణంలో షాట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం.