ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నాణ్యత లేని మద్యం ధరలు పెంచడం చాలా ఘోరమని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచడం వల్ల పేదోడు తాగడనే వాదన అర్థం లేనిదని ఆయన విమర్శలు చేశారు. దుకాణాల ముందు బారులు తీరింది పేదోళ్లా? ధనవంతులా? అనేది చూస్తే తెలుస్తుందని అన్నారు.
కూలీనాలీ చేసుకునే వాళ్లే ఆ ‘క్యూ’లలో ఉన్నారన్నారు. తాగుడుకు అలవాటు పడ్డవాళ్లు అవసరమైతే ఇళ్లల్లోని వస్తువులను సైతం అమ్మేసి మద్యం తాగుతారని అన్నారు. ఈ నాణ్యత లేని మద్యం తయారీకి కేవలం పదిహేను నుంచి ఇరవై రూపాయల ఖర్చు అవుతుందని, విక్రయించేది మాత్రం రూ.150 నుంచి రూ. 250కు ప్రభుత్వం విక్రయిస్తోందన్నారు. ప్రొడక్ష్క్షన్ కాస్ట్ కన్న ఎక్కువ ధరలకు విక్రయించడం క్షమించరాని నేరమని అన్నారు.