జగన్ డౌన్ డౌన్ అంటే అరెస్టు చేసి కేసులు పెడతారా ? అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్షంలో కొనసాగుతూ తనను నడిరోడ్డుపై ఉరితీయాలన్న వ్యాఖ్యలు పోలీసులకు వినపడలేదా అని ప్రశ్నించారు. జగన్ కిల్లర్ రాజకీయాలు టీడీపీ ముందు పనిచేయవని అన్నారు.
పులివెందుల రాజకీయాలు చేస్తే ఖబడ్దార్… తీవ్రవాదుల దాడులు తనను ఏమీ చేయలేకపోయాయని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తమ పార్టీ ఉంటుందన్నారు. నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు. ఒక నాయకుడు పోతే వంద మంది నేతలు పుడతారన్నారు. శ్రీకాకుళం జిల్లాకు టీడీపీకి అవినాభావ సంబంధం ఉందన్నారు.