ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అవినీతి రాజ్యానికి రాజు అని ఆరోపించారు. అలాంటివాళ్లు అవినీతి గురించి మాట్లాడం హస్యాస్పదంగా ఉందన్నారు.
గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ హౌసింగ్ విషయంలో షేర్ వాల్ టెక్నాలజీ సరైనది కాదని వైసీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు. నూతన ఇళ్ళల్లో పేదవారు ఉండకూడదా అని ప్రశ్నించారు. రాజీవ్ గృహాకల్పపై కూడా విచారణ చేస్తే బాగుంటుందన్నారు. 2004 నుంచి 2019 వరకు ఇళ్ల నిర్మాణాలపై విచారణ చేస్తే మేం స్వాగతిస్తామని అశోక్ బాబు పేర్కొన్నారు.