ప్రస్తుత ఖారీఫ్ సీజన్ లో రైతులకు విత్తనాల సరఫరా చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విత్తన కొరత అన్న సమస్యే రాలేదని చంద్రబాబు గుర్తుచేశారు.
2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత అన్నది లేకుండా చేశామన్నారు.టీడీపీ ప్రభుత్వం కారణంగానే విత్తనాల కొరత ఏర్పడిందని వైసీపీ నేతలు చెబుతున్నారనీ, దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఏపీలో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు చెప్పారు.