అటు ప్రపంచవ్యాప్తంగాను ఇటు దేశవ్యాప్తంగా ఆటో రంగం మందగమనం కొనసాగుతోంది. దీంతో వివిధ రకాల వాహనాల సేల్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఉద్యోగుల కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీం (VRS) తీసుకు వచ్చింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆటో, సాఫ్టువేర్, ఎఫ్ఎంసీజీ రంగాలు ఉద్యోగులను తగ్గించుకుంటోన్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మందగమనం ప్రభావం భారత్ పైనా ఉంది. సేల్స్ పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న టాటా మోటర్స్ ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకుంటోంది. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా 1,600 మంది ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది.
వీఆర్ఎస్ పథకాన్ని ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్స్ సహా వివిధ డిపార్టుమెంట్లకు విస్తరించాలని భావిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగులపై ఖర్చు చాలా ఎక్కువ అవుతోందని, జేఎల్ఆర్లో అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించిన యాజమాన్యం, ఇప్పుడు టాటా మోటర్స్లో 1,600 మందికి పైగా వీఆర్ఎస్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే ఈ ఏడాది టాటా మోటార్స్ కాస్ట్ కట్టింగ్ ప్లాన్ మరింత ఎక్కువగా ఉందంటున్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో పాటు 2020 ఏప్రిల్ నుంచి వస్తున్న కొత్త నిబంధనలు మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే హీరో మోటో కార్ప్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రయివేటు లిమిటెడ్, అశోక్ లేలాండ్ లిమిటెడ్ తదితర కంపెనీలు ఈ ఏడాది ఇలాంటి పథకాలు ప్రకటించాయి.