మొదటి నుండి దేశంలో జాతీయ కూటమి కోసం కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుకు సుముఖత చూపని మమతకు ప్రధానిపదవిపై కన్ను ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు. కానీ, దానికోసం ఆమె జాతీయంగానే కాంగ్రెస్ కు పోటీగా మరో కూటమి ఏర్పాటు కోసం చూస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ కూడా ఫ్రంట్ అనడంతో ఆమె ఆశలు రెక్కలు వచ్చేశాయి. దీనితో ఆమె తన కోరికను మరింత బలంగా వినిపించేందుకు ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగిస్తుంది. తాజాగా తృణమూల్ పార్టీ నుండి ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూడా అందులో భాగంగానే జరిగింది.
తాజాగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత మమతా బెనర్జీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థిగా దాదాపుగా ప్రకటించింది. లౌకిక, ప్రగతిశీల భారతావని నిర్మాణం కోసం ఆమె సారథ్యంలో కలసి పనిచేద్దామని పార్టీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వీడియో సందేశమిచ్చారు. రాష్ట్రాల వారీగా బీజేపీని- అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఎదుర్కోవాలని, ఆ ప్రాంతీయ పార్టీలకు జాతీయ పక్షాలు, మిగిలిన పార్టీలు మద్దతివ్వాలని ప్రతిపాదించినది ఆమే! ఈ మధ్యే మమతను తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కలిశారు. రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రె్సతో పాటు డీఎంకే లాంటి కొన్ని పార్టీలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. దీంతో మమత, కాంగ్రెస్-సారథ్య మహాకూటమికి కొద్దినెలలుగా దూరంగా మసలుతున్నారు.. ఈ దశలో ప్రధాని అభ్యర్థిగా ఆమెను తృణమూల్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘2019 ఓ పెద్ద మార్పు తీసుకొచ్చే ఏడాది కావాలి. కార్మికుల కోసం, పీడిత ప్రజల అభ్యున్నతి కోసం ఓ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని అభిషేక్ బెనర్జీ తన సందేశంలో పేర్కొన్నారు.