రాయలసీమ దుర్భిక్ష ప్రాంతమని టీడీపీ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సాగునీరు, తాగునీరు విషయంలో సీమ ప్రాంతం ఎంతో వెనుకబడిందని పేర్కొన్నారు. రాయలసీమలో మొదటి పంటకు కృష్ణా జలాల్లో హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వరద నీరు సముద్రానికి వెళ్లేంతవరకు కూడా నీళ్లు వదలకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కృష్ణా డెల్టాకు కృష్ణా జలాలతో పాటు గోదావరి నీళ్లు కూడా వస్తున్నాయని తెలిపారు. తుంగభద్ర అదనపు జలాలు కూడా వస్తున్నాయని అన్నారు. అందుకే రాయలసీమలో మొదటి పంటకు కూడా కృష్ణా జలాలు ఇవ్వాలని రైతుల తరఫున కోరుతున్నట్టు తెలిపారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించారు.