భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది. కొన్ని నెలల పాటు క్రికెట్కు దూరమవుతున్నందున శ్రేయస్ ట్విటర్లో స్పందించాడు. అభిమానుకు థాంక్స్ చెప్పాడు. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. అయ్యర్ కోలుకోవడానికి 4 నుంచి 5 నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును నడిపించే ఆటగాడి కోసం ప్రాంఛైజీ ఇప్పటికే చర్చలు మొదలెట్టింది. కెప్టెన్సీ కోసం ఐదుగురు ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. స్టీవ్ స్మిత్, పృథ్వీ షా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానేలు పోటీలో ఉన్నారు. గత సీజన్లో పరుగుల వరద పారించిన ఢిల్లీ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే ధావన్కు జట్టును ముందుండి నడిపించే సత్తా ఉన్నా.. గతంలో ఎప్పుడూ సారథ్యం చేసిన దాఖలు లేవు. కాబట్టి ధావన్కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు.