తొలిసారిగా కొడంగల్ లో జరిగిన అభినందన సభకు మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కొడంగల్ ప్రజలకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగిందని, టీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొడంగల్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని పిలుపు నిచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓటమిపాలు చేసేందుకు టీఆర్ఎస్ నేత హరీశ్ రావును కేసీఆర్ ఇక్కడికి పంపించారని ఆరోపించారు. ప్రస్తుతం హరీశ్ రావును కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.