ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆరెస్సెస్ పత్రిక ప్రచురించిన కధనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తుగ్లక్ పాలన సాగిస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధికార పత్రిక ఆర్గనైజర్ లో ప్రచురితమైన వ్యాసం సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్ర భవిష్యత్ను నాశనం చేసేలా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని దుగ్గరాజు శ్రీనివాసరావు అనే రచయిత ఆ వ్యాసంలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే రాజధానిని అమరావతి నుంచి తరలించి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని దుయ్యబట్టారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆ వ్యాసంలో సూచన చేసారు. అదే సమయంలో బీజేపీ బలోపేతానికదే ఛాన్స్ అంటూ మరో ఆసక్తి కర అంశాన్ని అందులో పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ కధనంలో మరో ఆసక్తి కర అంశాన్ని ప్రస్తావించారు. స్థానిక రాజకీయాలను పక్కనపెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవలసిన తరుణం ఆసన్నమైందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. మంచి సలహాలిచ్చి జగన్ను దారికి తేవాలనే సూచన కధనంలో కనిపించింది. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకోవడానికి అద్భుత అవకాశం కూడా అంటూ ఆరెస్సెస్ పత్రిక బీజేపీ అధినాయకత్వానికి సూచన చేసింది. కొద్ది రోజులుగా జాతీయ దిన పత్రికల్లో జగన్ పాలన పైన ఎడిటోరియల్స్ వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆరెస్సెస్ అధికారిక పత్రికలో ఇటువంటి కధనం రావటం ద్వారా..ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మరి..దీని పైన ఇప్పుడు వైసీపీ శ్రేణుల స్పందన ఏంటనేది చూడాల్సి ఉంది.