ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎదుట నాగులు అనే ప్రైవేటు టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని అసంతృప్తి చెందిన నాగులు ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.
అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే నాగులును ఆసుపత్రికి తరలించారు. అయితే మంటల్లో తీవ్రంగా కాలిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం కన్నుమూశాడు.
ప్రైవేటు టీచర్ నాగులు మృతిపై కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినా కూడా ప్రజలకు ఎలాంటి లాభం లేదని నాగులు ఆవేదనకు లోనయ్యాడని అన్నారు.
అమరవీరుల ఆత్మత్యాగాలతో వచ్చిన తెలంగాణ ఫలాలు కేవలం సీఎం కుటుంబానికే దక్కుతున్నాయని నాగులు వాపోయాడని తెలిపారు. అతని మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పొన్నం పేర్కొన్నారు.