రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం.. పార్లమెంట్ భవనంలోని రూమ్ 63లో మొత్తం ఆరు బూత్ ను ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సహా ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియగించుకుంటున్నారు. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో పోలింగ్ జరుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది కాబట్టి, ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను కేటాయించారు.
మొత్తం 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అందులో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలున్నారు.
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
#WATCH Prime Minister Narendra Modi votes to elect new President, in Delhi#PresidentialElection pic.twitter.com/pm9fstL46T
— ANI (@ANI) July 18, 2022