వైసీపీ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేధికగా విమర్శలు గుప్పించారు. వివిధ పథకాల ద్వారా రైతుకు ఏడాదిలో లక్ష రూపాయల మేర లబ్ది చేకూర్చుతాం అని చెప్పి చివరికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక అసమర్థ వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలో మోసముందని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గడచిన 15 నెలల్లో జగన్ రెడ్డి రైతు వ్యతిరేక నిర్ణయాల వల్లనే ఆత్మహత్యలు భారీస్థాయిలో పెరిగాయని లోకేశ్ ఆరోపించారు. అన్నదాతల బలవన్మరణాల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు.