ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం పర్యాటక నగరంగా టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాలమైన బీచ్ రోడ్డు వెంబడి ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకుల్లో నూతనుత్తేజాన్ని నింపుతాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా సెలవులను గడిపేందుకు ఇది సరైన స్థానం.
ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించినవారు, చారిత్రక విశేషాలను తెలుసుకున్న వారు మంచి అనుభవాలను తమతో పాటు తీసుకెళ్తారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశవిదేశాల నుంచి వచ్చే టూరిస్టులను సైతం అమితంగా ఆకట్టుకుంటూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా విశాఖ పేరొంది.
అయితే జవాద్ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తరాంధ్ర, ఒడిషా రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో తుఫాన్ తీవ్రత తగ్గేవరకు విశాఖపట్నంలోని పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు, సందర్శకులు రావద్దంటూ ప్రకటించింది.
అయితే ఇటీవల జవాద్ తుఫాన్ విశాఖపట్నంకు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే బలహీనపడి ఒడిషావైపుకు పయనమవడంతో ఏపీ ప్రజలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్నంలోని పర్యాటల కేంద్రాలను 3 రోజుల తరువాత తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.