గత వారంలో కాస్త చలి తీవ్రత తగ్గింది అనుకుంటుండగానే, మళ్ళీ తీవ్రంగా పెరిగిపోతుంది. సాధారణంగా చలి తీవ్రత సంక్రాంతి వరకు కొంతమేర ఎక్కువగానే ఉంటుంది. పండగ అనంతరం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే వాతావరణ పరిస్థితులు చూస్తుంటే, ఈ తీవ్రత పెరుగుతుందే కానీ, తగ్గే సూచనలు కనిపించడంలేదు. గత డిసెంబర్ చివరి వారం, ఆపై జనవరిలో రెండు, మూడు రోజుల తరువాత స్వల్పంగా తగ్గిన చలి మళ్లీ నిన్నటి నుంచి తన పంజాను విసురుతోంది. మంగళవారం నాడు ఆదిలాబాద్ లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాద్ లో 14, రామగుండంలో 12, హన్మకొండలో 13, విజయవాడలో 15, విశాఖపట్నంలో 13, తిరుమలలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
గత సోమ, మంగళవారాలలో, రాత్రి భారీగా మంచు కురిసింది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, ఆపై నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశం నిర్మలంగా ఉండటమే చలి పెరగడానికి కారణమని, ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని, మరికొన్ని రోజులు వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వారు హెచ్చరించారు.