జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. తాజాగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ టీఆర్ఎస్, ఎంఐఎంలపై మండిపడ్డారు. దుబ్బాకలో ఎలా గెలిచామో… హైదరాబాద్ లో అదే విధంగా గెలుస్తామన్నారు. MIM మేయర్ కావాలో… బీజేపీ మేయర్ కావాలో తేల్చుకోవాలని… ఒకే కుటుంబం పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని పేర్కొన్నారు. కుటుంబ పార్టీలు లూటీ చేస్తున్నాయని.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కి పాల్పడుతున్నదని ఫైర్ అయ్యారు. డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామని ఫ్లడ్ సిటీ గా మార్చారని.. 15 రోజులు వరదల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని… గ్లోబల్ సిటీ కాదు.. ఫ్లడ్ సిటీగా మార్చారని పేర్కొన్నారు. మోడీ 100 రూపాయలు ఇస్తే.. నేరుగా పేదవారి అకౌంట్ లో వేశారని.. టిఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా ఇచ్చే 10 వేల రూపాయలను మధ్యలో కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హుస్సెన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ల లాగా మారుస్తామన్నారని… ఏమైందని ప్రశ్నించారు. కరోనా కాలంలో సీఎం ఫామ్ హౌస్ లో ఉన్నాడని.. ప్రజల ఆరోగ్యం దేవుడికి వదిలేశాడని మండిపడ్డారు. ఆయుష్మాన్ యోజన, ఫసల్ భీమా, ఆవాస్ యోజన, 10 శాతం ews రిజిస్ట్రేషన్స్ తెలంగాణలో అమలు చేయడం లేదని.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కంట్రిబ్యూషన్ చాలా ఉందని ప్రకాష్ జవదేకర్ అన్నారు.