నేడు రాంచీలో పర్యటించిన ప్రధాని తమ ప్రభుత్వ 100 రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ముందుందని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎన్డీయే -2 ప్రభుత్వం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజలకు సమర్థమైన, వేగంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామని.. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ 100 రోజుల పాలన కేవలంల ట్రైలర్ మాత్రమేనన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
నల్ల ధనంపై మోడీ మాట్లాడుతూ, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిని ఎక్కడ ఉంచాలో.. అక్కడికే పంపిస్తున్నామనీ.. ఇప్పటికే కొందరిని పంపామని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అనేది తమ నినాదమన్నారు. కశ్మీర్, లద్దాఖ్లను అభివృద్ధి చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ముస్లిం సోదరిలకు అండగా నిలబడతామన్నారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ ద్వారా ఆ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఫలవంతంగా సాగాయన్న ప్రధాని.. అందుకు ఎంపీలందరికీ అభినందించాలన్నారు. రాష్ట్రంలోని రఘుబర్ దాస్ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు.