ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నెల 5న ఇక్రిశాట్ 50 వ వార్షికోత్సవ వేడుకలు, ముచ్చింతల్లో రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో మోదీ రానున్న పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు మోదీ చేరుకుంటారు. అక్కడ్నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వులోని ఇక్రిశాట్కు MI-17 హెలికాప్టర్లో బయల్దేరి, 2:35 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.
మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయాన్ని, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ రెండు సౌకర్యాలు ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలోని చిన్న రైతుల కోసం అంకితం చేయనున్నట్టు మోడీ ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను, స్మారక స్టాంపును ప్రధాని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5గం.లకు రామానూజాచర్య సమత మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు.
రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మోదీ పాల్గొంటారు. రాత్రి 8:25 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు మోదీ చేరుకుని ఢిల్లీకి బయల్దేరుతారు.
కాగా..ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముచ్చింతల్ శ్రీరామనగరంలో పటిష్ట భద్రాత ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏడు వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.
ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎస్పీజీ అధికారులు రాష్ట్ర పోలీసులతో అనేకసార్లు సమావేశమయ్యారు. ముచ్చింతల్ ప్రాంతమంతా అష్టదిగ్బంధనం చేశారు. ఇక్కడి శ్రీరామ నగరంలో ప్రత్యేకంగా అత్యాధునిక కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
బీజేపీ , కాంగ్రెస్ దొందూ దొందే: హరీష్ రావు