telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్ స్టార్ కొత్త లుక్ వైరల్

Pawan

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న మొన్నటి వరకు గుబురు గెడ్డంతో కనిపించిన పవన్.. ఇప్పుడు స్మార్ట్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ మేరకు ఆయన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మంగళవారం రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో పవన్ కళ్యాణ్‌తో ఆనంద్ సాయి కూడా కన్పించారు. “మీరు స్నేహితుడితో ఉన్నప్పుడు ఆ నవ్వులో నిజాయతీ ఉంటుంది. ఐదేళ్ల విరామం తర్వాత షూటింగ్ స్పాట్‌కు వచ్చిన నాకు ఇది ఎంతో ప్రత్యేకం” అని పేర్కొన్నారు. ఆనంద్ సాయితో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్‌షిప్ ఇప్పటి కాదు. ‘తొలిప్రేమ’ సినిమా నుంచే వీరిద్దరూ కలిసి పనిచేశారు. ‘తమ్ముడు’, ‘బాలు’, ‘గుడుంబా శంకర్’, ‘బంగారం’, ‘జల్సా’, ‘పులి’ సినిమాలకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన పని చేసిన ఆఖరి చిత్రం 2014లో వచ్చిన ‘ఎవడు’. ఇదిలా ఉంటే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వకీల్ సాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా లాక్‌డౌన్ కారణంగా సుమారు ఏడు నెలల పాటు షూటింగ్ నుంచి విరామం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నవంబర్ 1 నుంచి మళ్లీ ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు వినిపించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరుకి కానీ, డిసెంబర్ ద్వితీయార్థానికి కానీ ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నారట.

Related posts