న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో భారత్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లలోనూ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఒత్తిడికి తలొంచి చివరి ఓవర్లలో మ్యాచ్ను వదిలేసుకున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 5 నుంచి జరగబోయే వన్డే సిరీస్కు కివీస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్లు బౌల్ట్, ఫెర్గుసన్, హెన్రీలు గాయాలు కారణంగా జట్టుకు అందుబాటులో లేకపోవడం వల్ల సరికొత్త లైనప్ను ఎంపిక చేయాల్సి వచ్చింది. స్కాట్ కుగులీన్, హమిష్ బెన్నెట్లు చాలాకాలం తర్వాత వన్డేలకు ఎంపిక కాగా.. యువ పేసర్ కైల్ జేమిసన్ అరంగేట్రం దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా నాలుగో టీ20కు దూరమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రంగా ఉండటం వల్ల అతడు చివరి టీ20కు కూడా అందుబాటులో ఉండదని తెలుస్తోంది.
ఫిబ్రవరి 5 నుంచి జరగబోయే మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ హామిల్టన్ వేదికగా జరగనుంది. వన్డేలకు ఆల్రౌండర్లుగా నీషమ్, శాంట్నర్, కొలిన్ డి గ్రాండ్హోమ్లు వ్యవహరించనున్నారు. అటు స్పిన్నర్ ఇష్ సోథిని కేవలం ఒక్క వన్డేకు మాత్రమే ఎంపిక చేయగా.. పటిష్టమైన కోహ్లీసేనను ఎదుర్కొనేందుకు అన్ని ప్రణాళికలను జట్టు యాజమాన్యం సిద్ధం చేస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత ఇరు జట్లు ఆడుతున్న వన్డే సిరీస్ ఇదే కావడం గమనార్హం.
కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమిష్ బెన్నెట్, టామ్ బ్లండెల్, కొలిన్ డి గ్రాండ్హోమ్, మార్టిన్ గప్తిల్, కైల్ జేమిసన్, స్కాట్ కుగులీన్, టామ్ లేథమ్, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి (1 వన్డే), టిమ్ సౌథీ, రాస్ టేలర్.