చిత్తూరు జిల్లా లోని తిరుపతి లో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది.ఉరుములు మెరుపులు కురిసిన భారీ వర్షానికి వెస్ట్ చర్చి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. ఈ వరదలో చిక్కుకొని నవ వధువు మృతి చెందింది.ఈ విషాద ఘటన తిరుపతిలో జరిగింది.
తిరుపతిలో భారీ వర్షానికి వెస్ట్ చర్చ్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద కర్ణాటకకు చెందిన పెళ్ళిబృందం ప్రయాణిస్తున్న వాహనం నీట మునిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వాహనంలోని మిగతా ఆరుగురిని కాపాడారు. వాహనం నుంచి బయటికి రాలేక నవ వధువు చనిపోయింది. ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా ఆరుగురిని కాపాడారు. నీటి ప్రవాహాన్ని గమనించకుండా వెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని రాయచూర్ నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే వాతావరణ శాఖ రాగల 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.