బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటన మరోసారి పునరావృతం అయ్యింది. ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి నైరోబీ (కెన్యా రాజధాని)కి వెళుతుండగా, ఇథియోపియా కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 ఈటీ 302 విమానం కుప్పకూలింది.
అడిస్ అబాబాకు వాయవ్య దిశగా 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిషోఫ్టు పట్టణం సమీపంలో కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 157 మంది ఉన్నారు. వీరిలో 149 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన 8 మంది క్రూ సభ్యులు. ప్రమాద ఘటనపై ఇథియోపియా ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.