తమిళనాడులోని తిరువళ్లూరులో ని విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన తిరువళ్లూరు జిల్లా మప్పేడులో చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం వివాహబంధంతో ఒకటైన ఈ జంట చివరకు మృత్యుబంధంలోనూ వీడలేదు.
వివరాల్లోకి వెళితే..
అరక్కోణానికి చెందిన మనోజ్కుమార్ (31), తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన వైద్యురాలు కార్తీక (30)కు అక్టోబర్ 28న వివాహం జరిగింది. సోమవారం ఉదయం కారులో పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా మప్పేడు మార్గమధ్యలో అరక్కోణం నుంచి చెన్నై వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అనుకోని విధంగా వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మనోజ్కుమార్, కార్తీక అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మప్పేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 2 గంటల పాటు శ్రమించి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి చేసిన జంట విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.