ఈ వారంలోనే మరోసారి, జమ్మూకశ్మీర్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఎన్నికల వేళ దాడి చేసే అవకాశాలున్నాయని ఇంటెలిజిన్స్ వర్గాల తాజా సమాచారం. ఈనెల 5 నుంచి 9వ తేదీలోగా దాడులు జరగవచ్చని ఇంటెలిజిన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్ర దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అదనపు నిఘా ఏర్పాటు చేయాలని భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. లోక్సభ ఎన్నికలను అడ్డుకోవాలని పాక్ పట్టుదలగా ఉందని, ఇందులో భాగంగానే ఈ ఎన్నికల్లోపే జమ్మూకశ్మీర్లో కీలక దాడులు జరిపే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఇందుకోసం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మూడు టీమ్లు ఏర్పాటు చేసిందని, పోలింగ్ బూత్లు, అభ్యర్థులే ఈ టీమ్ల లక్ష్యమని, పేలుళ్లు సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలుగా స్థానిక ఉగ్ర సంస్థలకు శిక్షణ ఇచ్చేందుకు ఆప్ఘన్ నుంచి పనిచేస్తున్న ఓ టీమ్ను సరిహద్దులు దాటించేందుకు ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బలగాలకు అదనంగా 800 పారామిలటరీ బలగాలను కశ్మీర్కు పంపాలని ఇటీవల హోం మంత్రిత్వ శాఖ, ఎలక్షన్ కమిషన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. కాగా, పాక్లోని బాలాకోట్లో ఐఏఎఫ్ వాయుదాడుల అనంతరం ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆందోళన కలిగిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 16 ఉగ్రసంస్థలు ఇప్పటికీ చురుకుగా పని చేస్తున్నాయని, ఇక్కడ ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్లో ఏప్రిల్ 11 నుంచి మే 6 వరకూ ఐదు విడతలుగా లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి.
చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు: మంత్రి కన్నబాబు