భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవతో ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం విజయనగరంలోని కొత్తపేటకు చెందిన దేవి (24), చీపురుపల్లికి చెందిన వర్రి జగదీశ్ భార్యాభర్తలు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైన వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.
ఇటీవల ఏదో విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యతో జగదీశ్ మాట్లాడడం మానేశాడు. మూడు రోజులైనా భర్త తనతో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన దేవి ఈ నెల 26న క్షణికావేశానికి గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యను చూసిన భర్త, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవి నిన్న మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దే: రేవంత్ రెడ్డి