తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కొత్త సంవత్సర వేడుకలు మిన్నంటాయి. శుక్రవారం సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాలు సందడిగా మారాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కఠిన ఆంక్షల మధ్యే అందరూ 2021 సంవత్సరానికి ముగింపు చెబుతూ.. 2022 స్వాగతం పలికారు.
ప్రధాన నగరాలతో పాటు.. పల్లెల్లోనూ సంబరాలు సందడిగా సాగాయి. ప్రతి ఇంటి ముందు వెల్ కమ్ 2022.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పెట్టిన ముగ్గులు కొత్త సంవత్సరానికి ఆహ్వానించారు. విద్యుత్ దీప కాంతులతో వీధులు, ఇల్లు, అపార్ట్ మెంట్లు, సాపింగ్స్ మాల్స్ అన్నీ కళకళలాడాయి. కేక్ లు కట్ చేసుకొని కొందరు, స్వీట్లు తినిపించుకుని కొందరు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి, కరీంనగర్, వరంగల్ ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్ ఈవ్ అదిరిపోయింది. హైదరాబాద్ మహానగరంలో అర్థరాత్రి వరకు సెలబ్రేషన్స్ జరిగాయి. న్యూఇయర్ మొదలవగానే.. మూడు కమిషనరేట్ల సీపీలు తమ తమ ప్రాంతాల్లో కేక్స్ కట్ చేశారు. ఈ ఏడాది క్రైమ్ తగ్గాలని ఆకాంక్షించారు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక ఏపీలోనూ న్యూఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖలో గుళ్లకు పోటెత్తారు జనం. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని దేవుళ్లను కొరుకున్నారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో ప్రజలు ఇళ్లలోనే సంబరాలు చేసుకున్నారు. ఆంక్షలు ఉండడంతో బయటకు రాలేదు. నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇక పోతే నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తామని ఆయన తెలిపారు. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
అలాగే సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుసంపన్నంగా, సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రజలకు మరింత ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సంపదలను అందించాలని అభిలషించారు.