తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20 వరకు జరుగనున్నాయి. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ మేరకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 8న ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క హాజరయ్యారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై 40 నిమిషాలు ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.