అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్ దేశస్థుడేనని చెప్పుకొచ్చారు. సాంస్కృతికంగా తాము అణచివేతకు గురి కావడం వల్లే వాస్తవాలు మరుగునపడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సీతకు భారత యువరాజైన శ్రీరాముడితో వివాహం జరిగినట్టు తాము విశ్వసిస్తున్నామని అన్నారు. అప్పట్లో అయోధ్య భారత్లో లేదని ఇప్పుడున్నది కల్పితమని అన్నారు.
నిజానికి తమ దేశంలోని బిర్గుంజ్ దగ్గర్లో ఉన్న గ్రామమే అయోధ్య అని వివరించారు. భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ ఓలీ వివాదం సృష్టించారు. ఇప్పుడు పదవి ఊడిపోయేలా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మ్యాపుల విషయంలో భారత్, నేపాల్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఓలీ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.