కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన అగ్రవర్ణాల 10 శాతం రిజర్వేషన్ పై ప్రస్తుతం జాతీయంగా చర్చ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఎన్నికలలో మంచి అస్త్రంగా బీజేపీకి కలిసివస్తుంది అన్నది రాజకీయనిపుణుల అభిప్రాయం. అయితే ఈ అస్త్ర ప్రభావం గురించి బీజేపీ యేతర పార్టీలు కూడా జాగర్తగా ఆలోచిస్తున్నాయి. దీనిలో భాగంగానే నేడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అవుతారని, అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం సహా, పలు కీలకాంశాలపై వీరి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది.
ఈ పర్యటనలోనే మాయావతి, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, సీతారాం ఏచూరి తదితరులతో చంద్రబాబు భేటీ అవనున్నట్టు తెలుస్తుంది. కూటమి విధివిధానాలు, భవిష్యత్ విధివిధానాలపై వీరి మధ్య చర్చ జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ ఎంపీలతోనూ చంద్రబాబు భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంతో పోరాటం చేసే విషయంలో ఎంపీలకు కూడా ఈ పర్యటనలోనే దిశానిర్దేశం చేయనున్నారు.