అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరు క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్రంప్ చేసిన ట్వీట్పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
ట్రంప్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ… ‘నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. తమకు కరోనా సోకిందని ఈ రోజు ఉదయం ట్రంప్ ట్వీట్ చేసిన అనంతరం మెలానియా ట్రంప్ కూడా ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.
తనతో పాటు ట్రంప్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన అనంతరం హోం క్వారంటైన్లో ఉన్నామని చెప్పారు. తమ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. తాను పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.