ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఈ ఉదయం వీడియో సందేశం ఇచ్చారు. కరోనాపై పోరులో దేశం మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని పిలుపునిచ్చారు. కరోనాతో ఏర్పడిన అంధకారాన్ని పోగొట్టేందుకు ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం రాత్రి, 9 గంటల సమయంలో ఇళ్లలోని అన్ని లైట్లనూ ఆర్పివేయాలని, ఆపై వీధుల్లోకి రాకుండా ఇంటివద్ద నిలబడి, వీలైనన్ని ఎక్కువ దీపాలను వెలిగించాలని మోదీ కోరారు. లేకపోతే, సెల్ ఫోన్లలోని ఫ్లాష్ లైట్లను, టార్చి లైట్లను వెలిగించాలని ఆయన కోరారు. తద్వారా జాతి సంకల్పం ఒకటేనన్న సందేశాన్ని చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకూ 9 రోజుల పాటు విజయవంతంగా లాక్ డౌన్ ను అమలు చేశామని, మరో 11 రోజుల పాటు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఇండియాలో అమలవుతున్న లాక్ డౌన్ ను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నదని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను గమనిస్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇండియాను ఎన్నో దేశాలు ఇప్పుడు అనుసరిస్తున్నాయని తెలిపారు. 130 కోట్ల మంది ఒకే పని చేస్తే, ప్రపంచానికి ఓ సంకేతం వెళుతుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.