రానున్న రోజుల్లో వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని గుంటూరు సిట్టింగ్ ఎంపీ, టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం రాత్రి గుంటూర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందన్నారు.
జగన్ పార్టీ కేం ద్రంలోని బీజేపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. దేశంలో ఎన్డీఏ, యూపీఏ అనే రెండు కూటములు మాత్రమే ఉన్నాయని, అయితే జగన్, కేసీఆర్లు కలిసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి బుద్ధిచెప్పటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని గల్లా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ 22 ఎంపీ, 120 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు.