భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశవరావు, హోంమంత్రి మహముద్ అలీతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి, దేశానికి దిక్సూచి. అందరికీ ఆదర్శప్రాయుడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పీవీ పేరు ప్రఖ్యాతులు పొందారు. – స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప మహనీయుడు పీవీ. శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. – మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
పీవీ నరసింహారావు చేసిన సంస్కరణలు, ఆలోచనలు తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రజానీకంతో పాటు ఎన్ఆర్ఐలు కోరుతున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. పీవీ పేరుతో స్టాంప్ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. – రాజ్యసభ సభ్యులు కే కేశవరావు